పింగళి వెంకయ్య.. భారత దేశానికి జాతీయ జెండాను రూపొందించి అందించిన మహానుభావుడు.. ఆ మహానుభావుడు రూపొందించిన జాతీయ జెండా ఎర్రకోటపై ఎగురుతుంటే ప్రతీ భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. చెయ్యేత్తి జై కొట్టాలనిపిస్తుంది. అదే ఎర్రకోట మీద ఎలాంటి కుట్లు అల్లికలు లేని జాతీయ జెండా ఎగురుతుంటే ఎలా ఉంటుంది? అది చూసే ప్రతీ ఒక్కరి గుండె ఉప్పొంగుతుంది. ఆ ఆలోచనతోనే ప్రపంచంలో మొదటిసారిగా ఎలాంటి కుట్లు, అల్లికలు, ప్రింటింగ్ లేని జాతీయ జెండాను రూపొందించి శహభాష్ అనిపించుకున్నారు ఆచంట వేమవరానికి చెందిన రుద్రాక్షల సత్యనారాయణ.
ఎన్నో అవరోధాలు, దానికి తోడు ఆర్ధిక స్తోమత అడ్డంగా నిలిచాయి. కానీ తన సంకల్ప బలం గట్టిది కావడంతో ప్రయత్నాన్ని విరమించలేదు. తనకున్న స్తోమతతో పని ఆరంభించాడు. తన దగ్గరున్న సొంత మగ్గంపై జెండా తయారీని ప్రారంభించాడు. 2013లో తన మొదటి ప్రయత్నంలోనే సఫలీకృతుడయ్యాడు. 4X6 సైజులో భారతదేశ జాతీయ జెండాను తయారు చేసి రికార్డు నెలకొల్పాడు. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించినా.. అతడు నిరాశకు గురయ్యాడు. ఎర్రకోటపై ఎగురవేసే జెండా కొలతలు ఇవి కాదని తెలుసుకున్నాడు. దీంతో మరోసారి ఎర్రకోటపై ఎగురవేసే జెండాను తయారు చేయాలనుకున్నాడు.
మొదటి ప్రయత్నానికే తన దగ్గరున్న సొమ్ము అయిపోవడంతో ఈసారి జెండా తయారీకి ఆర్ధిక స్తోమత అడ్డుతగిలింది. 8X12 సైజు జెండా తయారీకి లక్షల్లో ఖర్చు అవుతుందని తెలుసుకున్నాడు. అయినా తన ప్రయత్నాన్ని అసలు వదిలేయలేదు. అనుకున్నది సాధించేదాకా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించాడు. జెండా తయారీ కోసం తనకు తెలిసిన వారందరి దగ్గర అప్పులు చేయడం ప్రారంభించాడు. సత్యనారాయణ ప్రయత్నం గురించి తెలుసుకున్న కొంతమంది అండగా నిలిచారు. దీంతో జెండా తయారీకి అవసరమైన 10 అడుగుల పురాతన మగ్గాన్ని కొనుగోలు చేశాడు.
పెద్ద జెండా తయారీకి మరో ముగ్గురి సహకారం అవసరమైంది. దీంతో సత్యనారాయణ భార్య, అక్క, బావ సహకారం అందించారు. కుటుంబం మొత్తం తోడు రావడంతో అనుకున్నది సాధించాడు. పగలు రాత్రి కష్టపడి ఎర్రకోటపై ఎగురవేసే జాతీయ జెండాను రూపొందించాడు. కుట్లు, అల్లికలు, ప్రింటింగ్ లేకుండా జాతీయ జెండాను రూపొందించడం అతి క్లిష్టమైన పని అంటారు నేతన్నలు. అయినా తాను అనుకున్నది సాధించేందుకు నాలుగేళ్లపాటు శ్రమించాడు సత్యనారాయణ.
మూడు రంగుల జాతీయ జెండాలో ఒక రంగు దారం మరో రంగు దారానికి కలవకుండా జాగ్రత్తగా లింక్ వేసుకుని నేత నేయాల్సి ఉంటుంది. అలా ఎక్కడా చిన్న తేడా కూడా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక జెండాలో మూడు రంగులు, అశోక చక్రంలోని 24 రేఖలు ఆకర్షణీయంగా ఉండేలా 2400 పట్టుదారాలతతో జాంధానీ, పైసానీ వర్క్లతో జెండాను రూపొందించాడు.
సత్యనారాయణ రూపొందించిన జెండాను జాతీయ నేతలను మెప్పించింది. తాను తయారు చేసిన జాతీయ జెండాను దేశ ప్రధాని మోదీ, అమిత్ షా, స్మృతీ ఇరానీ లాంటి జాతీయ నేతలకు చూపించాడు సత్యనారాయణ. ఇక సత్యనారాయణ తయారు చేసిన జెండాను చూసి ఏపీ సీఎం వైఎస్ జగన్ ముచ్చటపడ్డారు.
నాలుగేళ్లు కష్టపడి తయారు చేసిన జెండాను ఎర్రకోటపై ఎగురవేయాలని ఆకాంక్షిస్తున్నాడు సత్యనారాయణ.
Like our Facebook page ChuduBabai
Donate Plasma and Save Lives- Read Here
2,751 Total Views, 2 Total Views Today
- చిరంజీవి.. ఇండస్ట్రీ కోసం తగ్గాడు..నెగ్గాడు - February 12, 2022
- రైలు ప్రయాణం లేని దేశాలేంటో తెలుసా..? - February 11, 2022
- కశ్మీర్ లో రైలు ప్రయాణం ఇకపై మేఘాల్లో.. - February 11, 2022